‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

3 రాజధానులు నమ్మకద్రోహమే

‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌
ఇది దుస్సంప్రదాయానికి దారి
అమరావతి ఆంధ్రులందరిదీ
ప్రజా ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉంది

3 రాజధానులు నమ్మకద్రోహమే

కాపులకు మేం రిజర్వేషన్లు ఇవ్వం, వర్గీకరణ మా చేతుల్లో లేదు.. అని ఎన్నికలకు ముందు జగన్‌ స్పష్టంగా చెప్పారు. ఇలా చాలా విషయాలపై స్పష్టంగా చెప్పిన మనిషి రాజధాని విషయంలో కూడా తన మనసులో మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే ప్రజలు అప్పుడే నిర్ణయించుకునేవారు.

ఈనాడు – అమరావతి, హైదరాబాద్‌

అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితం కాదని.. ఇది ఆంధ్రులందరి సమస్యని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని.. మూడు రాజధానులంటే నమ్మకద్రోహమేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర విభజన అనుభవాన్ని చూస్తున్నామని.. మళ్లీ మూడు రాజధానులంటే రాష్ట్రాన్ని  మూడు ముక్కలుగా విభజించటానికి పునాది వేసినట్లే తప్ప మరోటి కాదని అన్నారు. అమరావతిపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసిన జనసేనాని.. రైతుల పోరాటం, వైకాపా యూటర్న్‌, దాని పర్యవసానాలపై ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు.

?రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులపై హైకోర్టుకు జనసేన పరంగా ఏం చెప్పబోతున్నారు?
పవన్‌ కల్యాణ్‌: రాష్ట్ర రాజధాని విషయంలో మేం మొదటి నుంచీ స్పష్టమైన వైఖరితోనే ఉన్నాం. రాష్ట్ర విభజన గాయాల మధ్య పుట్టిన బాధ ఇది. ఒక ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినా.. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు సరిగా స్పందించకపోవడంతో ఆ గాయాలు అలాగే ఉండిపోయాయి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక, అంతా కలసి ఒక నిర్ణయం తీసుకున్నాక మళ్లీ దీన్ని మార్చటం భవిష్యత్తులో ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలకు పునాది అవుతుందనేది మా ఉద్దేశం.

?భాజపాతో మీకున్న మైత్రి నేపథ్యంలో రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా చూడాలని ఆ పార్టీని కోరతారా?
ముందు నుంచీ భాజపా జాతీయ నాయకత్వం నడ్డా గానీ మరెవరైనాగానీ- ఇన్నిచోట్ల రాజధానులుండటం మంచిది కాదనే చెబుతున్నారు. తమ దృష్టిలో అమరావతే రాజధాని అనీ.. మీరూ ఆ దృక్పథంతోనే ముందుకెళ్లండని వారు నాకు చెప్పారు. భాజపా అధినాయకత్వం వైఖరి అదే.
?కానీ రాజధానితో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చెబుతోంది కదా?
రాజకీయంగా కాకుండా రాజ్యాంగపరంగా చూస్తే- అమరావతిని రాజధానిగా నిర్ణయించుకున్నప్పుడు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదు. ఇప్పుడూ అదే చేస్తోంది. తమ పరిమితుల్లోకి రానిదానికి వాళ్లెలా బాధ్యత తీసుకుంటారు? భాజపాను, కేంద్ర ప్రభుత్వాన్ని విడివిడిగానే చూడాలి.
అమరావతి రైతుల పోరాటం విషయంలో మీ వైఖరి?
అమరావతి సమస్యను 29 గ్రామాలకే పరిమితం చేస్తున్నారు. నిజానికిది రాష్ట్రం మొత్తం బాధ. ఈ పోరాటం మరింత బలమైన ఉద్యమంగా రూపుదిద్దుకోవాలి. సమస్యను సమర్థంగా అందరిలోకీ తీసుకెళ్లటం లేదు. అమరావతిపై జరుగుతున్న వ్యతిరేక వాదనల్ని తిప్పికొట్టడం లేదు. బెంగాల్‌లో సింగూరు సమస్య దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందంటే కారణం.. దాన్ని సమర్థంగా అందరికీ అర్థమయ్యేలా చేశారు. అమరావతికీ అదే కార్యాచరణ ఉండాలి.

?ఇందుకు మీరు ప్రత్యక్ష పోరాటానికి  దిగుతారా?
ప్రత్యక్ష పోరాటానికి అభ్యంతరం లేదుగానీ..  ఇది ఒక్కరు చేసేది కాదు. నేనొక్కణ్నే భుజాలపై ఎత్తుకునేదీ కాదు. సమష్టిగా, ఉమ్మడిగా చేయాల్సిన పోరాటం. తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఇదొక ప్రజా ఉద్యమం కావాలి. అమరావతి ఉద్యమం 29 గ్రామాల ప్రజలదో, ఒక కులానిదో, వర్గానిదో కాదని తెలియజెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరి మద్దతు కూడగట్టాలి. అమరావతిలో ఆడపడుచుల పోరాటం ఎంతో అద్భుతంగా ఉంది. వారి నాయకత్వంలోనే ఈ ఉద్యమం ముందుకు సాగితే బాగుంటుంది. కర్నూలులో సుగాలి ప్రీతి దుర్ఘటన 2017లో జరిగితే ఆమె తల్లి రెండేళ్లు ఎక్కని గడప లేదు.. తిరగని చోటు లేదు. ఆ తల్లి ఆవేదన మమ్మల్ని కలచివేసింది. అందర్నీ కదిలించి భుజం కాసేలా చేసింది.. ఒక తల్లి కదిలితేనే పోరాడాం. అలాంటిది ఇంతమంది తల్లులు కదిలితే ఎందుకు పోరాడం? కాకపోతే భాజపా, తెదేపా, వామపక్షాలు ఇలా అన్ని పార్టీలూ దీనికి కలసి రావాలి.

?అమరావతిని ఒక వర్గానికి లబ్ధి చేకూర్చే ప్రాజెక్టని వైకాపా విమర్శిస్తోంది.. దానిపై మీరేమంటారు?
ఇది దురదృష్టకరం. 2014లో వైకాపా అధికారంలోకి వచ్చి… దొనకొండలో రాజధాని పెట్టి ఉంటే అది ఒక సామాజికవర్గానికి చెందిన రాజధాని అని మరొకరు అనేవారు. ఇలాంటివి జరగకూడదంటే పాలకులకు విజ్ఞత ఉండాలి. ఒకసారి రాష్ట్ర విభజన అనుభవాన్ని చూస్తున్నాం. ఇప్పుడు కూడా మూడు రాజధానులనటం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడానికి పునాది వేసినట్లే తప్ప మరోటి కాదు. రాష్ట్రానికి కేంద్ర బిందువు (రాజధాని) ఒక్కటే ఉండాలని మా పార్టీ మొదట్నుంచీ నమ్ముతోంది. అమరావతిని కేంద్ర బిందువుగా నిర్ణయించుకోవడం అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం. అందరికీ న్యాయం జరుగుతోందనే భావన కలిగించడంలో తెదేపా విఫలమవడం ఈ పరిస్థితికి కొంత కారణం. నేనైతే ఒక వర్గానికే లబ్ధి జరుగుతుందని నమ్మటం లేదు. ఎందుకంటే రాజధాని పెట్టాక ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారు. అమరావతి ఏ ఒక్కరి సొత్తో కాదు. రాష్ట్ర ప్రజలందరిదీ! రాష్ట్ర విభజన అనంతరం క్షోభతో ఇక్కడ పెట్టుబడులు పెట్టినవారున్నారు.. నలుగురైదుగురు కలసి పెట్టుబడులు పెట్టిన ఇతర జిల్లాల వారున్నారు.

?అమరావతినే రాజధానిగా నమ్మి ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి కారణాలేంటి?
అమరావతిని రాజధానిగా ప్రకటించిననాడు ప్రజాసంఘాలుగానీ, రాజకీయ పార్టీలు గానీ నిరసనగళమెత్తి ఉంటే ప్రజలు ఆలోచించుకునేవారేమో! రాష్ట్రంలో ఆనాడు ఎక్కడా అమరావతికి వ్యతిరేకత రాలేదు. ఇంత పెద్ద ఎత్తున భూమి అక్కర్లేదు.. కాస్త చిన్న రాజధాని చాలని జనసేన మొదటి నుంచి స్పష్టంగా చెబుతూనే ఉంది. వైకాపా నాయకత్వం మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. జగన్‌ విపక్ష నేతగా ఉంటూనే అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు. తానొచ్చినా ఇదే రాజధాని అని సంకేతాలిచ్చారు. ప్రతిపక్ష నాయకుడు కదిలినప్పుడు మీరెందుకు కదలరని నన్ను చాలామంది అడిగారు. దాంతో నేనూ అమరావతిలో ఇల్లు తీసుకున్నాను. చాలామందికి ఇలాగే అమరావతిపై నమ్మకం పెరిగి పెట్టుబడులు పెట్టారు. ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులమ్మి ఇక్కడ కొనుక్కున్నారు. అమరావతితో అందరికీ అదో ఉద్వేగబంధం! కాబట్టి అమరావతి రాష్ట్ర రాజధాని అనే సమష్టి నిర్ణయంలో వైకాపా కూడా భాగస్వామే. అందుకు కట్టుబడి ఉండాల్సిందే.

?అధికార వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని ప్రభుత్వం చెబుతోంది?
నిజంగా అధికార వికేంద్రీకరణ జరగాలంటే పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇవ్వాలి. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణను వైకాపా ఇప్పటికే చేసేసిందని నా అభిప్రాయం. మళ్లీ అధికార వికేంద్రీకరణ ఏంటి? దశాబ్దాల కిందటే అభివృద్ధి చెందిన విశాఖలో రాజధాని పెట్టి కొత్తగా ఏం అభివృద్ధి చేస్తారు? మహా అంటే మైలో, రెండు మైళ్లో పెంచుతారు. అంతకంటే కొత్తగా సాధించేదేమీ లేదు. అదేదో ఇచ్ఛాపురంలోనో, అరకులోనో, అనంతపురంలోనో రాజధాని పెడితే కాస్త అభివృద్ధి జరుగుతుంది. ఇన్ని రకాల రాజధానులెక్కడా ఉండవు. పోనీ 3 రాజధానులు చేస్తే ఎవరికి లాభమో ఎవరికీ తెలియదు.

?మూడు చోట్ల ఏర్పాటు చేస్తామనటంలో హేతుబద్ధత ఏంటి?
ఇందులో హేతుబద్ధతేమీ లేదు. ఇలాంటి రాజకీయ ఆధిపత్య ధోరణులు, పోకడలే రాష్ట్ర విభజనకు కారణమయ్యాయి. నేడు రాష్ట్ర భవిష్యత్‌లో జరగబోయే దుష్పరిణామాలకు అవే కారణమవుతాయి. ఈ ఆలోచన విధానాన్ని రాష్ట్ర రాజకీయ నాయకత్వం వదిలిపెట్టాలి. వ్యక్తిగత ఎజెండాలతో ముందుకెళితే అలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయి.

?అమరావతినీ అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అంటోంది కదా?
అమరావతి నుంచి అన్నీ తరలించాక ఇంకా అక్కడుండే అభివృద్ధి ఏంటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. అలా కాకుండా అభివృద్ధి చేస్తామంటూ గాలిమాటలు మాట్లాడితే లాభం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఈ దుస్థితికి రావటానికి కారణం రాజకీయ నాయకత్వమే. కాపులకు మేం రిజర్వేషన్లు ఇవ్వం, వర్గీకరణ మా చేతుల్లో లేదు.. అని ఎన్నికలకు ముందు జగన్‌ స్పష్టంగా చెప్పారు. ఇలా చాలా విషయాలపై స్పష్టంగా చెప్పిన మనిషి రాజధాని విషయంలో కూడా మనసులో మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే ప్రజలు అప్పుడే నిర్ణయించుకునేవారు. ప్రతిపక్ష నేత హోదాలో అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో అంగీకరించిన జగన్‌ ఇప్పుడు ప్రజల మనోభావాలు, వారి ఆస్తిపాస్తులతో రాజకీయ చదరంగం ఆడతానంటే ఎలా?  ఏదైనా సమస్య వస్తే పరిష్కరించమని.. కష్టం వస్తే కాపాడమని ప్రజలు ప్రభుత్వం దగ్గరకు వెళతారు. కాపాడాల్సిన ప్రభుత్వమే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి దగ్గరికెళ్లాలి. అలాంటప్పుడు ప్రజలు కచ్చితంగా రోడ్లపైకి వస్తారు. ఇవాళ అమరావతి రైతుకు జరిగిన నష్టం రేపు మరో రైతుకు కలగదని నమ్మకమేంటి? అమరావతిలో జరిగింది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జరిగిన ఒప్పందం. రైతులు నమ్మి ఇచ్చింది ప్రభుత్వానికే తప్ప తెదేపాకో, వైకాపాకో కాదు. అమరావతి విషయంలో జరిగిన ఈ నమ్మకద్రోహంపై ప్రజలంతా ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఆచరణలోకి వస్తే ప్రభుత్వాలకు దుష్టసంప్రదాయంగా మారుతుంది. దీన్ని ఆపటానికి ప్రజలంతా ఏకమవ్వాలి.


రాజధానిని మార్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉండదా?

గత ప్రభుత్వ విధానాల్లో, పథకాల్లో, నిర్ణయాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకొని పోవాలి, అవకతవకలుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంతేతప్ప ప్రభుత్వాలు మారినప్పుడల్లా అన్నీ మారుస్తూ పోతే ప్రజాస్వామ్యం అవుతుందా? భూస్వామ్య వ్యవస్థలో ఇది కుదురుతుందేమోగానీ ప్రజాస్వామ్యంలో కుదరదు. రాజధాని అమరావతి అని అంతా కలసి నిర్ణయం తీసుకున్నాక అక్కడే కొనసాగించాలి. లేదంటే ప్రజాధనం దుర్వినియోగమవుతుంది.


రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో అమరావతి పట్ల స్పందన ఎలా ఉంది?

ఉత్తరాంధ్రలో ప్రజల సమస్య అందరి సమస్య కాకుండా పోతుందా? ఉద్ధానంలో కిడ్నీల సమస్య మనకేంటని ఎవరైనా ఎలా ఉండగలుగుతాం? కానీ దురదృష్టవశాత్తు అమరావతి పట్ల అలాంటి మానవత్వపు స్పందనే ప్రజల్లో కరవైందనిపిస్తోంది. ఇది కులాల తాలూకు గొడవల ప్రభావమే. నాకు తెలిసినంత వరకూ అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ అమరావతిపట్ల స్పందన,  ఆ రైతుల పట్ల సానుభూతి ఉంది. కానీ బహిరంగంగా స్పందించటం లేదు. రాజధానిపై గొడవ మొదలైనప్పుడు అన్ని జిల్లాల నుంచి జనసేన నాయకత్వాన్ని పిలిచాం. క్షేత్రస్థాయిలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారో తెలుసుకొని రమ్మన్నాం. విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాక మా పార్టీలో అంతా.. రాజధానిగా అమరావతే ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. పదేపదే మార్చటం మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రజలు చాలామందిలో అమరావతి రాజధానిగా ఉండాలనే ఉంది. కానీ రాజధానిని వాణిజ్యనమూనాగా చిత్రీకరించారు. అందుకే మిగిలిన ప్రాంతాలవారు దాన్నుంచి దూరమయ్యారనిపిస్తోంది. దీన్ని ఛేదించి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి. ఇది నేను తెలంగాణ ఉద్యమాన్ని చూసి నేర్చుకున్నా!


అమరావతిలో ఇల్లు కట్టుకోవటం ద్వారా జగన్‌రెడ్డి ఇదే రాజధాని అని అందరికీ సంకేతం పంపించారు. దాంతో చాలామంది పెట్టుబడులు పెట్టారు. కాబట్టి అమరావతి రాష్ట్ర రాజధాని అనే సమష్టి నిర్ణయంలో వైకాపా కూడా భాగస్వామే. అందుకు కట్టుబడి ఉండాలి.


రైతులు నమ్మి భూములిచ్చింది ప్రభుత్వానికే తప్ప తెదేపాకో, వైకాపాకో కాదు.    ప్రభుత్వాన్ని పాలించేవారు మారొచ్చు. కానీ విధానం మారితే ఎలా? అమరావతిపై యూటర్న్‌ తీసుకున్నారు. అది అక్కడికే పరిమితం కాదు. ఆ యూటర్న్‌ ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లకో.. భోగాపురం భూములకో.. మీ సంక్షేమ పథకాలకో వర్తించొచ్చు. కాబట్టి అమరావతిని కొంతమంది రైతుల సమస్యగా కాకుండా రాష్ట్రంలోని ప్రజలు, ప్రభుత్వానికి మధ్య నమ్మకం, ద్రోహం కోణంలో చూడాలి.


రాజకీయంగా ప్రజల్లో విభజన వచ్చేసింది. ప్రజలందరికీ సరైన ఉపాధి కల్పించకుంటే భవిష్యత్తులో రాష్ట్రంలో కుల, ప్రాంతీయ పోరాటాలు జరిగేలా వాతావరణం ఉందని భయమేస్తోంది. అది జరిగినప్పుడు.. ఆర్థిక, సామాజిక భద్రత ఉండదు. సిద్ధాంతపరంగా రాజకీయం చేయాలే తప్ప సామాజిక వర్గాలను అడ్డగోలుగా వ్యతిరేకించటం అవివేకం. వ్యక్తుల తప్పులను కులాలకు అంటగట్టడం సరికాదు. ఆంధప్రదేశ్‌ కులాల నుంచి బయటపడటానికి ఇదే సరైన సమయం.


 

జనసేన భవిష్యత్‌ ప్రణాళికేంటి?

3 రాజధానులు నమ్మకద్రోహమే

 

జనసేన ఆరంభించినప్పుడు మా పరిమితులు బాగా తెలుసు. నేను పెద్ద కలలేమీ కనలేదు. వాస్తవంలో బతికేవాళ్లం. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ప్రజాప్రయోజనాల కోసం పెట్టిన పార్టీ మాది. పార్టీని వాపులా చూపొచ్చు. కానీ అది బలం కాదు.  మేం ఓడినా భావజాలానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి బలంగా ఉన్నాం. కర్నూలులో సుగాలి ప్రీతి కేసులో మావాళ్లు బలమైన నేతల్ని ఎదుర్కొని బాధితుల తరఫున నిలబడ్డారు. కొవిడ్‌ సమయంలో కూడా మా కార్యకర్తలు ప్రజలకు సాయం చేశారు. చేస్తున్నారు. ఓట్లు పడతాయా లేదా అని కాకుండా ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. ఇలా మా స్థాయి, బలంతో ముందుకెళుతున్నాం. ఎవరి మెప్పు పొందాలనో, ఎవరికో నిరూపించుకోవాలనో పనిచేయట్లేదు. ప్రవాహంలో కొట్టుకుపోయేవారు కాకుండా కొత్త ప్రవాహాన్ని సృష్టించే శక్తి మా జనసైనికులకుంది.

 

d472d6ae_01-crop--b28b6b 411650eb_02-crop--16e5a6