‘పోలీస్ డైరీ’ వ్యాఖ్యాతగా ‘నాగబాబు’

nagababu policedairy

సినిమా నటుడిగా, ఆనక టీవీ ధారావాహికల తారగా, అడపా దడపా సినీ నిర్మాతగా చిరంజీవి సోదరుడు కొణిదెల నాగబాబు ఇప్పుడు మరో పాత్రలో కనిపించ నున్నారు. ఓ టీవీ సిరీస్‌కు వ్యాఖ్యాతగా ఆయన వ్యవహరి స్తున్నారు. అదీ రాత్రి వేళ వచ్చే నేర కథనాల సిరీస్‌కు వ్యాఖ్యానం కావడం విశేషం. ఉపగ్రహ తెలుగు టీవీ చానల్‌ ‘జీ – తెలుగు’లో రానున్న ‘పోలీస్‌ డైరీ’ కార్యక్రమానికి నాగబాబే ప్రెజెంటర్‌.

”మనిషి అన్ని రంగాల్లో దూసుకువెళుతున్నప్పటికీ, పెరిగిపోతున్న నేరాలను అరికట్టడంలో మాత్రం ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉన్నాడు. ఫలితంగా, రాత్రీ పగలూ తేడా లేకుండా, వయస్సులో తారతమ్యాలకు అతీతంగా, ఆడా మగా విచక్షణ లేకుండా ఎంతోమంది అఘాయిత్యాలకు బలి అవుతూనే ఉన్నారు. కాబట్టి, నేరాల విషయంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేయాల్సిన సమయం వచ్చింది” అని నటుడు నాగబాబు అన్నారు. అందుకే, ఈ ‘పోలీస్‌ డైరీ’ కార్యక్రమానికి వ్యాఖ్యానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకు తగ్గట్లే, ‘పోలీస్‌ డైరీ’కి ‘పీపుల్‌ ఎగైనెస్ట్‌ క్రైమ్‌ (పి.ఏ.సి)’ అని ఉపశీర్షిక కూడా పెట్టారు.

జూన్‌ 16వ తేదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఈ ‘పోలీస్‌ డైరీ’ కార్యక్రమం ప్రారంభం కానుంది. అప్పటి నుంరచి ప్రతి శని, ఆది వారాల్లో రాత్రి 9.30 గంటల నుంచి ఓ గంట పాటు ఇది ప్రసారమవనుంది. ”ఓ సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో కేవలం నేరాలు జరిగే తీరు మీద దృష్టి సారించడమే కాక, అలాంటి నేరాలను నిరోధించడం ఎలా అన్నదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం” అని నాగబాబు వివరించారు. ఈ టీవీ కార్యక్రమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీక్షకుల కోసం ఆత్మ రక్షణలో శిక్షణనిచ్చే వర్క్‌షాపులు, ప్రత్యక్షంగా ఆత్మ రక్షణ విధానాలు ప్రదర్శించి చూపడం లాంటి పలు కార్యక్రమాలను ‘పీపుల్‌ ఎగైనెస్ట్‌ క్రైమ్‌’ పేరిట చేపట్టనున్నట్లు సమాచారం.